ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం.. సర్కార్ విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం.. సర్కార్ విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత
  •    ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తన ధ్యేయమని  ప్రభుత్వ విప్, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌‌‌‌గా నియమితులైన సందర్భంగా శుక్రవారం మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్’ అనే నినాదంతో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలల్లో గదులు, తాగునీరు, టాయిలెట్లు లాంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని, టీచర్లు మార్గదర్శకులుగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్టీయూ నాయకులు మదన్మోహన్ యాదవ్ , సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.